ఆ సాహసికుడు సీఎం జగన్‌ మాత్రమే

అమరావతి, జనవరి 30 (న్యూస్‌టైమ్): పరిపాలన గ్రామస్థాయికి తీసుకెళ్లిన సాహసికుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఇన్నాళ్లుగా అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ, ఏ ముఖ్యమంత్రి కూడా గాంధీజీ ఆశయాల గురించి ఆలోచన చేయలేదని, గ్రామస్థాయికి పరిపాలన తీసుకెళ్లలేదన్నారు. పరిపాలన గ్రామస్థాయికి తీసుకెళ్లిన సాహసికుడు వైయస్‌ జగన్‌ మాత్రమేనని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు. అంతేకాదు వైయస్‌ జగన్‌ పాలన నూతన చరిత్రను లిఖిస్తుందన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆనాడు ప్రవచించిన నినాదాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ఆచరించి అమలు చేశారన్నారు. గ్రామస్థాయికి పాలనే కాదు గడప ముందుకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నారని చెప్పారు. రైతాంగానికి సంక్షేమం గట్టుస్థాయికి తీసుకెళ్లారని, పంట పండించండి గట్టు దగ్గరకు యంత్రాంగాన్ని పంపించి కొనుగోలు చేయిస్తానని రైతుల్లో భరోసా నింపారన్నారు. పంటకు పెట్టుబడిసాయంతో పాటు గ్రామస్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరా చేస్తానని రైతు భరోసా కేంద్రాలు తెచ్చారన్నారు.

గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ, ఎక్కడా జరగలేదన్నారు. రూ. 1కే పంట ఇన్సూరెన్స్‌ కల్పిస్తున్నారని, గాంధీజీ ఆలోచన విధానాన్ని అనుసరించి విజయవంతంగా సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తూ గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెట్టి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారని ప్రభుత్వ సలహాదారు, వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మనసు పెట్టి గాంధీ ఆలోచనలను అమలు చేస్తే సమాజాన్ని ఆదర్శవంతంగా మార్చడమే కాకుండా స్వావలంబన దిశగా ఎలా మార్చగలం అనేది మన రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో చూశామన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వారసుడు వైయస్‌ జగన్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రెండేళ్ల క్రితం వరకు మాటల్లో మాత్రమే ఉన్న గాంధీజీ తత్వాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు.

టెక్నాలజీ పెరిగిన కాలంలో గ్రామ స్వరాజ్యం ఏంటీ అని అందరూ అనుకున్న దశలో సీఎం వైయస్‌ జగన్‌ గ్రామాల అభివృద్ధి అవసరమేనని, పరిపాలనకు గ్రామస్థాయికి తీసుకువెళ్లారన్నారు. గుమ్మం ముందుకు పాలన తీసుకెళ్లి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచేలా చేశారన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ పరిపాలన పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే ఊహించని ప్రగతి జరుగుతుందని, వచ్చే మూడేళ్లలో మరిన్ని అభివృద్ధి సంక్షేమాలు జరుగుతాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మరో అడుగు ముందుకేసి ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. రాజకీయాలు గ్రామాల్లో ఉండకూడదు.. కక్షలు పెరగకూడదనే ఉద్దేశంతో ఏకగ్రీవాలను ప్రోత్సహించేలా అడుగులు వేయాలని సూచిస్తున్నారన్నారు. ఇలాంటి ఆలోచనలు, విధానాలు బాగా పరిపక్వత చెందిన మహర్షి స్థాయి లాంటి వ్యక్తికి మాత్రమే ఉంటాయని, కానీ, 47 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అంత పరిపక్వత చూపడం నిజంగా విశేషమన్నారు.

Latest News