- రోగులకు అత్యవసరమైన సమయంలో వైద్య సేవలకు వినియోగం
- కోవిడ్ సమయంలో బాగా ఉపయోగపడుతున్న ఆక్సిజన్ ప్లాంట్
- హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.రామస్వామి నాయక్
అనంతపురం : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు అత్యవసరమైన సమయంలో వైద్య సేవలు అందించేందుకు 13 కిలో లీటర్స్ సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.రామస్వామి నాయక్ తెలిపారు. గత నెల 25 వ తేదీ నుండి ఈ ఆక్సిజన్ ప్లాంట్ వినియోగం లోకి వచ్చిందన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ల అవసరం తగ్గిందన్నారు. త్వరితగతిన ఈ ప్లాంట్ ఏర్పాటయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల కోవిడ్ సమయంలో ఈ ప్లాంట్ హాస్పిటల్ కు బాగా ఉపయోగపడుతోందన్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులకు, ప్రసవాలు, పాము కాటు, విష సేవనం తదితర అన్ని శాఖలకు సంబంధించి ఆక్సిజన్ అవసరమైన అత్యవసర రోగులకు ఈ ప్లాంటు ద్వారానే ఆక్సిజన్ అందించడం జరుగుతోందని సూపరింటెండెంట్ వివరించారు. దీంతో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.