Uncategorized

నిస్వార్థ రాజకీయ నాయకుడు గొట్టేటి దేముడు

పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్ల భాగ్యలక్ష్మి

రిపోర్ట్ : పల్లా గోవిందరావు

కొయ్యూరు, కోస్తా టైమ్స్, ( అక్టోబర్ 26) :
గిరిజనుల ముద్దుబిడ్డ, నిస్వార్ధ రాజకీయ నాయకుడు, గిరిజనుల హృదయాలలో ఇప్పటికీ సుస్థిర స్థానం సంపాదించుకున్న మచ్చలేని రాజకీయ నాయకుడు కామ్రేడ్ గొట్టేటి దేముడని పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్ల భాగ్యలక్ష్మి అన్నారు. దివంగత నేత గొట్టేటి దేవుడు 8వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైన మండలంలోని వెలగల పాలెంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గాము గంటం దొర విగ్రహాన్ని ఎంపీ మాధవి తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ,
ఉమ్మడి విశాఖ జిల్లాలో చింతపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయట నిలదీసి పోరాడి సాధించిన నాయకుడాయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్యకు అధ్యక్షునిగా, ఆల్ ఇండియా గిరిజన ఆర్గనైజేషన్ కు ఉపాధ్యక్షునిగా పనిచేసారని, రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి తుది శ్వాస విడిచే వరకు ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జీవించిన నాయకుడు గొట్టేటి దేముడని ఆమె కొనియాడారు. ఆయన కుమార్తె అరకు ఎంపీ మాధవి కూడా ఆయన బాటలోనే పయనిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఆమె కొనియాడారు . ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 50 లీటర్ల రక్తదానాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో దివంగత నేత గొట్టేటి దేవుడు కుమార్తె, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, అల్లుడు శివ ప్రసాద్ , కుమారుడు మహేష్ చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.