రూ. 363.4 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆమోదం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): ‘ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన’ కింద 363.4 కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలకు (ఏపీసీ) మౌలిక సదుపాయాలను కల్పించడం, ఫుడ్ ప్రాసెసింగ్, వాటిని నిల్వ చేసే సౌకర్యాలను ఎక్కువ చేయడానికి నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ అధ్యక్షతన సమావేశం అయిన ఇంటర్ మినిస్టీరియల్ ఆమోదం కమిటీ (ఐఎంఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కమిటీ సమావేశం ప్రతిపాదనలను పరిశీలించి వీటికి ఆమోదం తెలిపింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి, ప్రోజెక్టుల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐఎంఏసీ ఆమోదించిన ప్రాజెక్టుల వల్ల ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ఎక్కువగా జరగడమే కాకుండా వాటి విలువ పెరుగుతుందని భావిస్తున్నారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరిగి స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

సమావేశంలో ఆమోదం పొందిన ప్రోజెక్టుల వివరాలు:

సీఈఎఫ్ పిపిసీ కింద, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మిజోరాం, గుజరాత్ రాష్ట్రాలలో 36.30 కోట్ల రూపాయల గ్రాంట్-ఇన్-ఎయిడ్‌తో సహా 113.08 కోట్ల రూపాయల విలువ చేసే 11 ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. వీటిలో 76.78 కోట్ల రూపాయల మేరకు ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయి. వీటివల్ల 3,700 మందికి ఉపాధి కలగడమే కాకుండా 6800 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ సామర్ధ్యాలను మెరుగు పరచి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఆధునీకరించి, సామర్ధ్యాన్ని ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో రూపొందిన ఈ పథకానికి ‘ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన’ కింద 2017 మే అయిదవ తేదీన ఆమోదం లభించింది. ప్రాసెసింగ్ చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచి వాటి వృధాను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది.

ఏపీసీ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన…

మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, రాజస్థాన్ రాష్ట్రాలలో 66.61 కోట్ల రూపాయల గ్రాంట్-ఇన్-ఎయిడ్‌తో సహా 250.32 కోట్ల రూపాయల విలువ చేసే తొమ్మిది ప్రాజెక్టులకు అనుమతి లభించింది. వీటిలో 183.71 కోట్ల రూపాయల మేర ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయి. వీటివల్ల 8260 మందికి ఉపాధి కలగడమే కాకుండా 36000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనను ప్రోత్సహించడానికి ఏపీసీ ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించాలన్న పధకానికి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 2017 మే మూడవ తేదీన ఆమోదం లభించింది.

Latest News