పార్లమెంట్ సాఫీగా సాగడం ముఖ్యం: మోదీ ఆశాభావం

న్యూఢిల్లీ, జనవరి 30 (న్యూస్‌టైమ్): దేశాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంట్ సాఫీగా సాగడం ముఖ్యమని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. పార్లమెంట్ బడ్జెటు సమావేశాల అంశంపై శనివారం ఏర్పాటైన అఖిలపక్ష సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంలో ఆయనకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలిని ఘటించారు. మహాత్ముని కలలను పండించేందుకు మనం పాటుపడాలి అని ప్రధాన మంత్రి అన్నారు. యూఎస్ఎలో ఈ రోజున ఉదయం మహాత్మ గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడాన్ని ప్రధాన మంత్రి ఖండిస్తూ, ద్వేషంతో కూడిన అలాంటి వాతావరణానికి మన ప్రపంచంలో చోటు లేదు అన్నారు.

వ్యవసాయ చట్టాల అంశంలో ప్రభుత్వం దాపరికం లేనటువంటి మనస్సుతో వ్యవహరిస్తోంది అని చెప్తూ ప్రధాన మంత్రి భరోసాను కల్పించారు. ఈ అంశంలో ప్రభుత్వం వైఖరి జనవరి 22న ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రతిపాదన ఇప్పటికీ ఇంకా స్థిరంగానే ఉందని ప్రధాన మంత్రి తెలిపారు. చర్చలను ముందుకు తీసుకుపోవడానికి వ్యవసాయ శాఖ మంత్రికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ నెల 26న జరిగిన దురదృష్టకర సంఘటన గురించి నేతలు ప్రస్తావించగా చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని ప్రధాన మంత్రి అన్నారు.

సమావేశంలో నేతలు ప్రస్తావించిన అంశాలపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. పార్లమెంట్ సాఫీగా నడవడం, సభావేదిక మీద విస్తృతమైన చర్చలు జరగడం ముఖ్యం అని ఆయన పునరుద్ఘాటించారు. పదేపదే అంతరాయాలు జరుగుతూ ఉంటే చిన్న రాజకీయపక్షాలు నష్టపోతాయి, అవి వాటి అభిప్రాయాలను తగిన స్థాయిలో వ్యక్తం చేయలేకపోతాయని ప్రధాన మంత్రి వివరించారు. పార్లమెంట్ సక్రమంగా పనిచేసే విధంగాను, ఎలాంటి అంతరాయాలు ఎదురవకుండాను చూడవలసింది పెద్ద రాజకీయ పక్షాలే, అలా చూస్తే అప్పుడు చిన్న రాజకీయపక్షాలు వాటి అభిప్రాయాలను పార్లమెంటులో వినిపించగలుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రపంచ క్షేమం కోసం అనేక రంగాలలో భారతదేశం మహత్వపూర్ణమైనటువంటి పాత్రను పోషించగలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మన దేశ ప్రజల నైపుణ్యాన్ని, సాహసాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అవి ప్రపంచ సమృద్ధిని గుణాత్మకమైన రీతిన ఇంతలంతలు చేయడంలో ఓ శక్తిగా మారగలుగుతాయని అన్నారు.

Latest News