న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (న్యూస్టైమ్): నేషనల్ డిఫెన్స్ కాలేజీ (ఎన్డీసీ)లో 61వ కోర్సు 110 మంది అభ్యర్ధులతో ఈ నెల 1న మొదలైంది. అంతక్రితం నిర్వహించిన కోర్సు కంటే ఈ సారి 10 మంది అభ్యర్ధులు ఎక్కువగా ఉన్నారు. పెంచిన సీట్లలో చాలా వరకు సీట్లను మిత్రపూర్వకంగా మెలగుతున్న విదేశాలకు చెందిన అధికారులకు కేటాయించడం జరిగింది. ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, ఫిలిపీన్స్, మాల్దీవ్స్లకు చెందిన అధికారులు చెప్పుకోదగ్గ విరామం అనంతరం ఈ కోర్సులో పాల్గొంటున్నారు.
మొట్టమొదటి ఎన్డీసీ కోర్సును 1960వ సంవత్సరంలో నిర్వహించారు. ఇంతవరకు పరిశీలిస్తే, ఈ కాలేజీలో 3,899 మంది పూర్వ విద్యార్థులు ఉండగా వారిలో 835 మంది 69 మిత్రపూర్వక విదేశాలకు చెందిన వారు. సివిల్ సర్వీసులలో రెండు ఖాళీలు పెరిగాయి. ఎన్డీసీ 61వ కోర్సులో 19 మంది సివిల్ సర్వీసుల అభ్యర్ధులు ఉన్నారు. 61వ కోర్సుకు విదేశీ అధికారుల సంఖ్య పెరగడాన్ని ఎన్డీసీ కమాండెంట్ ఎయర్ మార్షల్ డి. చౌధురి స్వాగతించారు. ఎన్డీసీ ఇదివరకటి సంవత్సరాలలో ఎదురైన సవాళ్ళను అవకాశాలుగా మార్చుకోగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవలే స్థాపించిన ‘ప్రెసిండెంట్స్ చైర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ’ ఎన్డీసీలో విద్య పరమైన ప్రావీణ్యానికి మెరుగులు దిద్దడంలో తోడ్పడనుందన్నారు.
నేషనల్ డిఫెన్స్ కాలేజీ (ఎన్డీసీ) తాలూకు వజ్రోత్సవ సంవత్సరాన్ని స్మరించుకోవడం కోసం 2020వ సంవత్సరం నవంబరు 2వ తేదీన ఈ చైర్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన పదవిలో తొలి అధికారిగా ఎయర్ వైస్ మార్షల్ డాక్టర్ అర్జున్ సుబ్రమణియమ్ (ఎవీఎస్ఎమ్, రిటైర్డ్)ను నియమించడం జరిగింది.