9000 దిగువకు రోజువారీ కరోనా కేసులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): భారతదేశంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిరుడు సెప్టెంబర్ 10న గరిష్ఠ స్థాయిలో నమోదైన కేసులు ఇప్పుడు 8 నెలల కనిష్ఠానికి తగ్గుతూ ఈ రోజు 8,635గా నమోదయ్యాయి. భారత దేశపు సగటు కొత్త కేసులు కూడా గత 5 వారాలుగా స్పష్టమైన తగ్గుదల నమోదు చేసుకుంటున్నాయి. 2020 డిసెంబర్ 30–2021 జనవరి 5 మధ్య సగటు 18,934 కాగా జనవరి 27-ఫిబ్రవరి 2 మధ్య 12,772కు తగ్గింది.

మరో కీలకమైన అంశమేమిటంటే గత 24 గంటల్లో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 100 కంటే తక్కువ నమోదైంది. ఇది గత 8 నెలల్లో అత్యల్పం. 2020 మే 15న 100 మరణాలు నమోదయ్యాయి. సగటు రోజువారీ మరణాలు కూడా గత 5 వారాల్లో ఇదే ధోరణి ప్రదర్శించాయి. 2021 జనవరి 27- ఫిబ్రవరి 2 మధ్య మరణాలు 128 కాగా 2020 డిసెంబర్ 30- 2021 జనవరి 5 మధ్య 242 సగటు మరణాలు నమోదయ్యాయి. చికిత్సలో ఉన్న కేసుల విషయానికొస్తే, ఆ సంఖ్య మరింత తగ్గి ఈ రోజుకు 1,63,353కు చేరింది.

ఇది దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో ఇవి 1.52% మాత్రమే. దేశంలో ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,04,48,406కు చేరింది. కోలుకున్నవారి శాతం 97.05%గా నమోదైంది. కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా 2021 ఫిబ్రవరి 2 ఉదయం 8 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య 39,50,156గా నమోదైంది. గత 24 గంటలలో 3,516 శిబిరాలలో 1,91,313 మంది ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు మొత్తం 72,731 శిబిరాలు నిర్వహించారు. ప్రతిరోజూ టీకాల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 24 గంటలలో 13,423 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.

కొత్తగా కోలుకున్నవారిలో 85.09% మంది 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా ఒకే రోజులో అత్యధికంగా కోలుకున్నవారిలో కేరళలో 5,215 మంది, మహారాష్ట్రలో 3,289 మంఇద్, చత్తీస్‌గఢ్‌లో 520 మంది ఉన్నారు. కొత్తగా పాజిటివ్‌గా నిర్థారణ అయినవారిలో 80.10% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా 3,459 కేసులు రాగా, మహారాష్ట్రలో 1,948, తమిళనాడులో 502 మంది పాజిటివ్‌గా నిర్థారణ అయ్యారు. కోవిడ్ అదుపులో రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు కేరళ, మహారాష్ట్రలకు కేంద్రం ఉన్నతస్థాయి వైద్య ఆరోగ్య బృందాలను పంపింది. గత 24 గంటలలో 94 మంది కోవిడ్ కారణంగా మరణించారు. మృతులలో 65.96% మంది ఐదు రాష్ట్రాలకు చెందినవారు. మహారాష్ట్రలొ గరిష్ఠంగా 27 మంది, ఆ తరువాత కేరళలో 17 మంది, తమిళనాడులో ఏడుగురు మరణించారు. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.

Latest News