చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య 1,36,549కి చేరింది. ఇది మొత్తం ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో 1.25% మాత్రమే. గడిచిన నెలరోజులుగా అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుతూ రావటం గమనించదగ్గ పరిణామం. జనవరి 17న చికిత్సలో ఉన్నవారు 53,163 మంది కాగా ఈ రోజు అది 38,307కు తగ్గింది. గత 24 గంటలలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు చేయలేదు. అవి: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, లక్షదీవులు, మణిపూర్, లద్దాఖ్, అస్సాం, అండమాన్-నికోబార్ దీవులు, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి. ఇక, భారతదేశంలో కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ప్రస్తుతం 1,06,44,858కి చేరింది. కోలుకున్నవారి శాతం 97.33%గా నమోదైంది.

గత 24 గంటలలో 11,833 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. పెరుగుతున్న కోలుకున్న కేసులు,కొత్త కేసులు నామమాత్రంగా ఉండటం కారణంగా చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య బాగా తగ్గింది. గత 24 గంటలలో 11,610 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు, 2021 ఫిబ్రవరి17వ తేదీ ఉదయం 8 గంటలకు మొత్తం కోవిడ్ టీకాలు అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కలిసి దాదాపు 90 లక్షలకు చేరుకున్నారు. 1,91,373 శిబిరాల ద్వారా 89,99,230 మందికి ఇప్పటిదాకా కోవిడ్ టీకాలు ఇచ్చినట్టు ఉదయం 8 గంటల సమాచారం మేరకు తెలుస్తోంది. వీరిలో 61,50,922 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది కాగా 2,76,377 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది. వీరుకాక కోవిడ్ యోధులు 25,71,931 మంది మొదటి డోస్ అందుకున్నారు.

కోవిడ్ టీకాల రెండో డోస్ కార్యక్రమం ఫిబ్రవరి 13న మొదలుకాగా మొదటి డోస్ అందుకొని 28 రోజులు గడిచిన వారందరూ ఈ రెండో డోస్ తీసుకోవటం ప్రారంభించారు. టీకాల కార్యక్రమంలో 32వ రోజైన ఫిబ్రవరి 16న మొత్తం 7001 శిబిరాలలో 2,76,943 మందికి టీకాలు ఇచ్చారు. వారిలో 1,60,691 మంది టీకా లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా 1,16,252 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన టీకాలలో 57.8% లబ్ధిదారులు 8 రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 9,34,962 మంది (10.4%) టీకాలు తీసుకున్నారు. 2021 ఫిబ్రవరి 16 సాయంత్రం 4 గంటలవరకు మొత్తం 36 మంది ఆస్పత్రిలో చేరారు. టీకాలు తీసుకున్నవారిలో 29 మంది చనిపోయారు. ఆస్పత్రిలో చేరిన 36 మందిలో 22 మంది చికిత్స అనంతరం ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు ఇంకా ఆస్పత్రిలో ఉన్నారు. 12 మంది చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన 29 మరణాలలో17 మంది ఆస్పత్రి వెలుపల చనిపొగా, 12 మంది ఆస్పత్రులలో మరణించారు.

కొత్తగా కోలుకున్నవారిలో 81.15% మంది 6 రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యారు. కేరళలో ఒక్క రోజులో అత్యధికంగా 5,439 మంది కోలుకోగా, మహారాష్టలో 2,700 మంది, తమిళనాడులో 470 మంది కోలుకున్నారు. కొత్తగా పాజిటివ్‌గా తేలినవారిలో 86.15% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా 4,937 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు రాగా, మహారాష్ట్రలో 3,663 మంది, తమిళనాడులో, 451 మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. కాగా, గత 24 గంటలలో 100 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వారిలో 81% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 39 మంది మరణించగా కేరళలో 18 మంది, తమిళనాడులో ఏడుగురు చనిపోయారు.

Latest News