న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (న్యూస్టైమ్): కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పియూష్ గోయల్ నేడు వివిధ ప్రదేశాలలో ఉన్న ఇతర ప్రముఖుల సమక్షంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉత్తర బెంగాల్ ప్రాంతంలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణీకుల సౌకర్యాలకు సంబంధించిన పనులను జాతికి అంకితం చేశారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి దేబశ్రీ చౌదరితో పాటు వివిధ ప్రదేశాల నుండి ఇతర ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పియూష్ గోయల్ మాట్లాడుతూ ‘‘దేశానికి రైల్వే అసాధారణ రీతిలో సేవలు అందిస్తోంది. సోనార్ బంగ్లా మిషన్ సాకారానికి రైల్వేశాఖ కూడా భారీ చొరవ తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో రానున్న 3 సంవత్సరాలలో రైల్వేలు పూర్తిగా విద్యుదీకరించడం జరిగింది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తవుతాయి.’’ అని అన్నారు.
ఉత్తర బెంగాల్ సహజంగా అందంగా ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతం అభివృద్ధి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని, ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి భారత రైల్వే కట్టుబడి ఉందని తెలిపారు. భారతీయ రైల్వే నెట్వర్క్ను 100% విద్యుదీకరణ చేసేందుకు జరుగుతున్న పనుల్లో భాగంగా జల్పైగురి నుండి న్యూ కూచ్బెహార్ వరకు ఏర్పాటు చేసిన 126 రూట్ కిలోమీటర్ ఈ రోజు జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల వైపు రైళ్ల రాకపోకలకు ఈ విభాగం చాలా ముఖ్యమైనదని, విద్యుదీకరణ ద్వారా ఈ ప్రాంతంలో స్థిరమైన పురోగతి సాధించడంతో సరుకు రవాణా చేసే రైళ్లు, ప్రయాణీకుల రైళ్లను ఎక్కువ సంఖ్యలో తక్కువ కార్బన్ – ఉద్గారాలతో పర్యావరణ అనుకూల పద్ధతిలో నడపవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ధర సుమారు రూ. 287 కోట్లని, అలాగే శిలాజ ఇంధనాల వినియోగంలో భారీ పొదుపుకు దారి తీస్తుందని, మొత్తం ఎన్.ఎఫ్ రైల్వే విద్యుదీకరణకు 2018 బడ్జెట్లో నిధులు కేటాయించామని, దీనిని 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఈ ప్రాంతం భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న హల్దిబారి స్టేషన్ నిర్మితమైందని, ఈ కొత్త స్టేషన్లో 26 కోచ్ సామర్థ్యం, 2 గూడ్స్ లైన్తో 3 ప్యాసింజర్ ప్లాట్ఫాంలు ఉన్నాయన్నారు. హల్దిబారి వద్ద స్టేషన్లో కొత్త భవన నిర్మాణంతో పాటు రైల్వే లైన్లు, రన్నింగ్ రూములు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి పనులను సుమారు రూ. 82.72 కోట్లు వ్యయం చేయడం జరిగిందని, ఈ విభాగంలో రైలు కార్యకలాపాల భద్రతను పెంచడానికి హల్దిబారి, జల్పాయిగురి స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 17న పిఎం స్థాయి వర్చువల్ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశంలోని హల్దిబారి, బంగ్లాదేశ్లోని చిలహతి మధ్య రైల్వే సంబంధాన్ని ప్రారంభించారని గోయల్ గుర్తుచేశారు.
‘‘పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దినజపూర్ జిల్లాలో గంగరంపూర్ ఒక ముఖ్యమైన పట్టణం. రూ. 09.09 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఇక్కడి స్టేషన్ను క్రాసింగ్ స్టేషన్గా ఏర్పాటు చేసి హై లెవల్ ప్లాట్ఫాం, ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్తో నిర్మించారు. తద్వారా స్థానిక ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేరింది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు, సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో, కార్యాచరణ అవసరాలను తీర్చడానికి అలీపూర్దుర్ జెఎన్ స్టేషన్ తిరిగి అభివృద్ధి చేశారు. స్థానిక సంస్కృతికి అనుగుణంగా తీర్చిదిద్దిన కొత్త స్టేషన్ భవనం రూ. 8.11 కోట్ల వ్యయంతో నిర్మితమైంది. భారతీయ రైల్వే ప్రయాణికుల ప్రయోజనం కోసం అన్ని ముఖ్యమైన స్టేషన్లలో కొత్త లిఫ్టులు, ఎస్కలేటర్లను అందిస్తోంది. అలీపూర్దుర్ జెఎన్ స్టేషన్ వద్ద ప్రయాణీకుల ఉపయోగం కోసం సుమారు రూ. 80.8 లక్షల వ్యయంతో రెండు కొత్త లిఫ్టుల ప్రయాణీకులకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఉపయోగం కోసం నిర్మించారు. అలాగే దివ్యాంగులు ప్లాట్ఫాం – 1, 2, 3 నుండి ఇతర ప్లాట్ఫామ్లకు వెళ్లడానికి ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి. ఉత్తర బెంగాల్లోని డూయర్స్ విభాగంలోని మదరిహాట్ స్టేషన్ ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం. 1.13 కోట్ల రూపాయల వ్యయంతో ప్లాట్ఫామ్ నంబర్ 1, 2 మధ్య కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం వలన స్టేషన్లోని ఫ్లాట్ఫామ్ 2 వద్ద ఆగే బోర్డింగ్, డి-బోర్డింగ్ రైళ్లను చేరేందుకు ప్రయాణీకులకు సురక్షితమైన మార్గం లభిస్తుంది. భారత రైల్వే దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన స్టేషన్లలో హై మాస్ట్ జెండాలను ఏర్పాటు చేస్తోంది. న్యూ కూచ్బహర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన అటువంటి ఎత్తైన జాతీయ జెండా కూడా జాతికి అంకితం చేయడం జరిగింది.’’ అని కేంద్ర మంత్రి గోయల్ పేర్కొన్నారు.