హైదరాబాద్, ఏప్రిల్ 5 (న్యూస్టైమ్): గ్రేటార్ హైదరాబాద్లో నాలా పూడిక తీత పనులు, నాలా విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను మరింత ముమ్మరంగా చేసేందుకు గాను ప్రతీ జోన్కి ప్రత్యేకంగా ఒక చీఫ్ ఇంజనీర్ను పర్యవేక్షక అధికారిగా నియమిస్తున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సమీక్ష నిర్వహించారు.
ప్రధానంగా నగరంలో శానిటేషన్, రహదారుల అభివృద్ధి, నాలా విస్తరణ కార్యక్రమాలపై నిర్వహించిన ఈ సమావేశానికి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఉపమేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్. జీహెచ్ఎంసీ, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటలు సాగిన ఈ సమావేశంలో మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ సాధ్యమైనంత అదనపు యంత్రాలు, మానవ వనరులను ఉపయోగించి పూడిక పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పూడిక తీత పనులు అత్యంత ప్రాధాన్యతగల పనుల్లో చేరుస్తూ వీటి పనులకుగాను నిధులను విడుదల చేసేందుకై ప్రత్యేకంగా గ్రీన్ చానెల్ను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా, నగర అభివృద్ధి, సామాన్య ప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాలా లలోని ఆక్రమణలను, అడ్డంకులను తొలగించాలని, అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపులో నిరాశ్రయులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వెంటనే కేటాయించాలని ఆదేశించారు.
నాలా విస్తరణ, అడ్డంకుల తొలగింపు పనులను సంబంధించి ప్రభుత్వమే నిధులు పూర్తిగా మంజూరు చేయడం జరుగుతుందని, ఈ విషయంలో స్వల్ప కాలికా పనులను పరిపాలన సంబంధిత అనుమతులను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. నగరంలో లింక్ రోడ్ల నిర్మాణం, సీఆర్ఎంపీ పనుల పురోగతి ముమ్మరంగా సాగుతున్నాయి ముఖ్యంగా వివిధ ప్రాజెక్టులకు భూ సేకరణకై రూ. 2800 కోట్ల విలువైన టీడీఆర్లను అందచేయడం దేశంలో మారే నగరంలోనూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు.
ఈ విషయమై కమిషనర్ లోకేష్ కుమార్, ఛీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డిని మంత్రి అభినందించారు. మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న కార్యక్రమాల అమలులో హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలకన్నాముందంజలో ఉందని, దీనిలో భాగంగా ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో చేపట్టిన దాదాపు 21 ప్రాజెక్టులు నగర వాసులకు అందుబాటులో వచ్చాయని, మరో 17 ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తికానున్నాయని వెల్లడించారు. నగరంలోని చెరువులను సుందర తటాకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా చూపరులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
హైదారాబాద్ అభివృద్ధికి తోడ్పడే మరిన్ని వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను మంత్రి కోరారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మరింత శ్రద్ధ చూపించాలని, ఈ విషయంలో జోనల్ కమిషనర్లు ప్రతీ రోజూ ఉదయం వేళలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సర్కిళ్ల వారీగా శానిటేషన్ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. ప్రతీ సర్కిల్లో ఎన్ని నివాసాలున్నాయి? శానిటేషన్ స్టాఫ్ ఏంత మంది ఉన్నారు? ఇంటింటి నుండి చెత్త సేకరణకు ఎన్ని స్వచ్ఛ ఆటోలున్నాయి? అదనంగా ఎన్ని కావాలి? తదితర అంశాలపై ఈ ఆడిట్ నిర్వహించాలని కోరారు.
గతంలో ఉన్న పరిచయం, సంతకాల సేకరణ తదితర కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగర పౌరుల సదుపాయాలకై ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశనికి ముందు జన్మదినోత్సవం సందర్బంగా బాబు జగజీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు అర్పించారు.