న్యూఢిల్లీ, జనవరి 25 (న్యూస్టైమ్): మంగళవారం నాటి గణతంత్ర దిన కవాతులో పాలుపంచుకోనున్న ఆదివాసి అతిథులు, ఎన్సిసి కేడెట్లు, ఎన్ఎస్ఎస్ స్వయంసేవకులు, శకటాల కళాకారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగత సత్కారం (ఎట్ హోమ్) కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ ముండా, కిరెన్ రిజీజూ, రేణుకా సింహ్ సరూతాలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గణతంత్ర దిన కవాతులో ఆదివాసి అతిథులు, కళాకారులు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి కేడెట్ల భాగస్వామ్యం ప్రతి ఒక్క పౌరునిలో/పౌరురాలిలో శక్తిని నింపుతుందన్నారు.
దేశం తాలూకు గొప్ప వైవిధ్యాన్ని వారు ప్రదర్శించడం ప్రతి ఒక్కరిని గర్వంతో నింపివేస్తుంది. గణతంత్ర దిన కవాతు భారతదేశం ఘన సామాజిక, సాంస్కృతిక వారసత్వాలకు, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి జీవం పోసిన రాజ్యాంగానికి మనం అందించే ఒక బహుమానం లాంటిదంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఈ సంవత్సరంలో భారతదేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, ఈ సంవత్సరంలో మనం గురు తేగ్ బహాదుర్ జీ 400వ ప్రకాష్ పర్వ్ను జరుపుకొంటున్నామని ప్రధాన మంత్రి తెలిపారు. దీనికి అదనంగా, ఈ ఏడాదిలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి కూడా ఉంది, దానిని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకోవాలని ప్రకటించడమైంది. ఈ ఘట్టాలు మనం మన దేశం కోసం మరొక్క సారి అంకితం చేసుకోవడానికి ప్రేరణను ఇస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం తన దేశవాసుల ఆకాంక్ష తాలూకు సామూహిక బలానికి ప్రతిరూపం అని ప్రధాన మంత్రి యువ అతిథులతో అన్నారు. భారతదేశం అంటే అనేక రాష్ట్రాలు- ఒకే దేశం; అనేక సముదాయాలు- ఒకే భావన; అనేక మార్గాలు- ఒకే లక్ష్యం; అనేక ఆచారాలు, సంప్రదాయాలు- ఒకే విలువ; అనేక భాష లు- ఒకే అభివ్యక్తి; అనేక రంగులు- ఒకే మువ్వన్నెల జెండా అని ఆయన అన్నారు. మరి అందరి సమాన గమ్యం ‘ఏక్ భారత్-శ్రేష్ట భారత్’యే. ఒకరి ఆచారాలు, వంటకాలు, భాషలు, కళలపైన మరొకరికి జాగృతిని పెంచడానికి కృషి చేయాలని, దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువ అతిథులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘ఏక్ భారత్-శ్రేష్ట భారత్’ కార్యక్రమం ‘లోకల్ ఫార్ వోకల్’కు బలాన్ని ఇస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వస్తువును మరొక ప్రాంతం గౌరవంగా భావించి, ప్రోత్సహించినప్పుడే స్థానిక ఉత్పత్తులకు జాతీయ స్థాయి అందుబాటు, ప్రపంచ స్థాయి అందుబాటులో లభిస్తాయి. ‘లోకల్ ఫార్ వోకల్’, ఆత్మ నిర్భర్ అభియాన్ సఫలత మన యువతపైన ఆధారపడింది అని ప్రధాన మంత్రి అన్నారు. దేశ యువతలో సరైన నైపుణ్యం ఏర్పడవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. నైపుణ్యం తాలూకు ఈ మహత్త్వాన్ని స్పష్టం చేయడానికి నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2014లో ఏర్పాటైందని, 5.5 కోట్ల మంది యువతీయువకులకు వివిధ నైపుణ్యాలను అందజేయడం జరిగిందని, స్వతంత్రోపాధి, ఉద్యోగ కల్పనలో తోడ్పడిందని ఆయన అన్నారు. ఈ నైపుణ్యం కొత్త జాతీయ విద్య విధానంలో స్పష్టంగా కనుపిస్తోంది, జాతీయ విద్య విధానంలో జ్ఞానాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి పెద్ద పీటను వేయడం జరిగింది. ఎవరైనా వారికి ఇష్టమైన విషయాన్ని ఎంపిక చేసుకోవడంలో వెసులుబాటు అనేది ఈ విధానంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. వృత్తి విద్య ను విద్య తాలూకు ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావడానికి గంభీరమైన ప్రయత్నం జరిగింది. 6వ తరగతి తరువాత నుంచి, విద్యార్థి తన ఆసక్తి, స్థానిక అవసరాలు, వృత్తి విద్యలకు అనుగుణంగా ఏదైనా ఒక పాఠ్యక్రమాన్ని ఎంపిక చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత, మధ్య స్థాయిలో, విద్య విషయాలను వృత్తిపరమైన విషయాలను జోడించుకోవాలని ప్రతిపాదించడం జరిగింది.
దేశానికి అవసరమైన సమయంలో, ముఖ్యంగా కరోనా కాలంలో, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్లు అందించిన తోడ్పాటును ప్రధాన మంత్రి ప్రశంసించారు. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం తదుపరి దశలో ఈ కృషిని మరింత ముందుకు తీసుకు పోవాలి అని ఆయన కోరారు. టీకామందును ఇప్పించే కార్యక్రమంలో సాయపడడానికి, టీకామందు విషయంలో చైతన్యాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడానికి దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ సమాజంలోని ప్రతి కేంద్రంలోనూ వారి పరిధిని ఉపయోగించాలంటూ ఆయన సూచించారు. టీకామందును తయారు చేయడం ద్వారా, మన శాస్త్రవేత్తలు వారి కర్తవ్యాన్ని నెరవేర్చారు, ఇప్పుడు మన వంతు వచ్చింది. మనం అసత్యాన్ని, వదంతులను వ్యాప్తి చేసే ప్రతి ప్రయత్నాన్ని నిష్ఫలం చేయాలి అని ప్రధాన మంత్రి అన్నారు.