అంబేద్కర్, జగ్జీవన్ ఉత్సవాలపై వినతి

విజయవాడ, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): భారతరత్న బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ‘పీవీ రావు మాల మహానాడు’ కృష్ణా జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యాలయం కంకిపాడులో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రావ్ జయంతిని, ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని, అంబేద్కర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్రె చిట్టి బాబు, దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్, మాల మహానాడు గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడు సరిహద్దు అంతోని, పెనమలూరు నియోజకవర్గ అధ్యక్షుడు పైయర్థ రామకృష్ణ, ఉదయ భాస్కర్, మారుమూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Latest News