హైదరాబాద్, మార్చి 8 (న్యూస్టైమ్): భిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్న యువ హీరో నిఖిల్. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈయన ప్రస్తుతం కార్తికేయ సీక్వెల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా సీక్వెల్ను పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందూ మొండేటి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తపోయింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. కలర్స్ స్వాతి కూడా కీలక పాత్రలో నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కార్తికేయ 2లో మరో సంచలన అప్ డేట్ బయటికి వచ్చింది ఇప్పుడు.
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. మార్చి 7న ఈయన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఈ విషయం. కార్తికేయ 2లో అనుపమ్ ఖేర్ కారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాడు దర్శకుడు చందు. అలాంటి అద్భుతమైన నటుడు తమ సినిమా ఒప్పుకోవడం ఆనందంగా ఉంటుందంటున్నారు యూనిట్. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్తరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కీరవాణి కొడుకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. గతేడాది తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రీ పొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లడానికి సిద్ధమయ్యారు దర్శక, నిర్మాతలు. ఈ సినిమాలో ముగ్ధ పాత్రలో నటిస్తుంది అనుపమ పరమేశ్వరన్. గతంలో కార్తికేయ 2కి సంబంధించిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ నటులు తెలుగులో నటించారు. ఇప్పుడు అనుపమ్ ఖేర్ కూడా వస్తున్నాడు.