అమరావతి, ఫిబ్రవరి 18 (న్యూస్టైమ్): ప్రజలకు సేవ చేయాలనే తపన, తాపత్రయం ఆయన సొంతం.. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన నమ్మకం.. ముఖ్యమంత్రి పదవి ప్రజలకు సేవ చేసేందుకే అనేది ఆయన విశ్వాసం.. ఆ దిశగానే మొదలైన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన ప్రస్థానం నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చిన సీఎం జగన్ని ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు స్కోచ్ గ్రూపు ఎంపిక చేసింది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 20 నెలల పాలనలోనే అత్యుత్తమ పురస్కారాన్ని సీఎం వైయస్ జగన్ దక్కించుకున్నారు.
వైయస్ జగన్ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డును స్కోచ్ గ్రూప్ చైర్మన్ కొచ్చర్ అందించారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ముందుగానే ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడం ఆసక్తికర నమూనాగా నిలిచిందని వెల్లడించారు. దీనివల్ల రైతులకు భారీ ప్రయోజనం కలగడంతో పాటు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
దిశ, అభయ పథకాల ద్వారా మహిళల భద్రత, రక్షణకు చర్యలు తీసుకున్నారని, తద్వారా శాంతి భద్రతలు వెల్లివిరియడంతోపాటు మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని తెలిపారు. వైయస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు జీవనోపాధికి చేయూత, అనుసంధాన రుణాలు ఇవ్వడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు దోహదం చేశారన్నా రు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.
కరోనా నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని, స్పందించిన తీరు, తీసుకున్న చర్యలతో పాటు 123 ప్రాజెక్టులపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో మెరుగైన ఫలితాలు స్పష్టంగా కనిపించాయని స్కోచ్ గ్రూప్ చైర్మన్ వివరించారు. పాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వివిధ రంగాల్లో వినూత్న చర్యలు తెచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్కు దక్కుతుందన్నారు. తమ ముఖ్యమంత్రికి బెస్ట్ సీఎం అవార్డు రావడం పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.