అమరావతి, ఫిబ్రవరి 22 (న్యూస్టైమ్): అవినీతి నిర్మూలన కోసమే ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దుర్గగుడిలో ఏసీబీ దాడులపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ప్రభుత్వంలో ఏసీబీ ఓ భాగమన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏసీబీ దాడులు పెరిగాయని, ఎక్కడా అవినీతి జరగకుండా ఉండటానికి దాడులు చేపడుతున్నట్లు చెప్పారు. ద్వారక తిరుమలలో కూడా గతంలో ఏసీబీ దాడులు జరిగాయని అన్నారు.
కరోనా సమయంలో ప్రజలకు టీడీపీ నేతలు సాయం చేశారా అని ప్రశ్నించారు. టీడీపీ నేత జలీల్ఖాన్ వక్ఫ్ బోర్డు ఆస్తులు దోచుకున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో స్క్రాప్ జలీల్ఖాన్ అని విమర్శించారు. జలీల్ ఖాన్ ఓ సిగ్గులేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు ద్వారా కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. చంద్రబాబు, జలీల్ ఖాన్ అవినీతిపరులని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు.