దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి ప్రాచుర్యం

హైదరాబాద్, జనవరి 24 (న్యూస్‌టైమ్): నగరానికి గర్వకారణంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి మరింతగా ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం కల్పించడంతో పాటు, జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నేటి ఉదయం నిర్వహించిన 10కె, 5కె రన్లలో పెద్ద ఎత్తున రన్నర్లు పాల్గొని విజయవంతం చేశారు. కేబుల్ బ్రిడ్జిపై మొట్ట మొదటి సారిగా నిర్వహించిన ఈ టెన్ కె రన్‌ను రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రారంభించారు. వందలాది మంది యువతి యువకులు, రన్నర్లు ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ రన్‌లో ముఖ్య కార్య దర్శి అర్వింద్ కుమార్ కూడా స్వయంగా పాల్గొని రన్నర్లను ఉత్సాహపరిచారు. ఈ సందర్బంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ లీవబుల్ సిటీగా ఉన్న హైదారాబాద్ నగరం ప్రపంచ మేటి నగరాలకు ధీటుగా అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని, ముఖ్యంగా పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు బాలికా విద్యకు మరింత ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశ్యంతో పలు స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఈ రన్‌లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, అనంతరం, 5కె రన్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజాన్, దివ్యంగుల రన్‌ను దివ్యా దేవరాజన్‌లు ప్రారంభించారు. ఈ రన్‌లను ఇనార్బిట్ మాల్, యూ టూ కన్ రన్, నిర్మాణ్, ప్యూమా తదితర సంస్థల సహకారంతో నిర్వహించారు.

కాగా, రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకొని సుప్రసిద్ధ మొజామ్ జాహీ మార్కెట్లో ‘షామ్-ఏ- సూఫీయానా’ అనే పేరుతో సోమవారం సాయంత్రం ఆరున్నరకు ప్రముఖ కవ్వాలి బృందం వార్సీ బ్రదర్స్ చే కవ్వాలి ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ మొజామ్ జాహీ మార్కెట్‌ను జీహెచ్ఎంసీ పునరుద్ధరించిన విషయం విదితమే.

Latest News