సద్భావన దినం పాటించిన రైతులు

ఢిల్లీ సరిహద్దుల్లో నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు…

న్యూఢిల్లీ, జనవరి 30 (న్యూస్‌టైమ్): నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో రెండు నెలలుగా అన్నదాతలు సాగిస్తున్న ఉద్యమం రోజురోజుకి ఉదృతరూపం దాలుస్తోంది. నిన్న సింఘ్ సరిహద్దు వద్ద స్థానికుల పేరుతో కొందరు రైతులపై దాడి చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో హస్తిన సరిహద్దుల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసి రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. సింఘు, ఘాజీపుర్‌, టిక్రీ తదితర సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ నిన్న రాత్రి 11 గంటల నుంచి ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రైతులు సరిహద్దును వీడి వెళ్లాలని స్థానికులుగా చెప్పుకొంటున్న కొందరు కర్రలతో వచ్చి సింఘు సరిహద్దులో ఘర్షణ పడ్డారని అధికారులు తెలిపారు. రైతుల గుడారాలపైకి రాళ్లు రువ్వారాని, దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్‌ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. ఖాళీ చేయాలంటున్నవారంతా కిరాయి గూండాలంటూ కొందరు వాలంటీర్లు రైతులకు సర్దిచెప్పే పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. టిక్రీ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది.

దీంతో అక్కడ కూడా భద్రతను పెంచి పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ఉపవాస దీక్ష చేపట్టిన రైతులు: మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఆందోళన చేస్తున్న రైతులంతా సద్భావన దినం పాటించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉపవాస దీక్ష నిర్వహించారు.

Latest News