బంగారు తెలంగాణకు పునాదులు

దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం..

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌..

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): ఉద్యమ నాయకుని సారధ్యంలో తెలంగాణ అన్ని రంగాలలో పురోగమిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ అన్నారు. సరికొత్త విజన్‌, కొత్త పథకాలు, నూతన ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదాల్చిందని, గడచిన ఆరున్నరేళ్లలో ఆకలిదప్పులు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయని చెప్పారు. 72వ గణతంత్ర వేడుకలు మంగళవారం నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్‌ పతాకావిష్కరణ చేసి వివిధ భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, బీబీపాటిల్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పతాకావిష్కరణ అనంతరం గవర్నర్‌ ప్రసంగిస్తూ ‘‘తెలంగాణ అనేక రంగాల్లో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఉద్యమ నాయకుడికే ప్రజలు పాలనాపగ్గాలు అప్పగించడం వల్ల తెలంగాణలో అద్భుతమైన పాలనసాగుతోంది. లాక్‌డౌన్‌ను కట్టదిట్టంగా అమలుచేయడం, కరోనా వ్యాప్తిని అరికట్టడం, రోగులకు సకాలంలో వైద్యం అందించడలో రాష్ట్రం ముందంజలో ఉంది. వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో 2021లో మనమంతా ఆశావహ దృక్పథంతో ముందుకెళదాం. లాక్‌డౌన్‌లో ప్రతి పేద కుటుంబానికి నెలకు 12 కిలోల బియ్యం, రూ.1,500లు ప్రభుత్వం ఉచితంగా అందించింది. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజన వసతిని కల్పించింది. వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపించింది. ప్రభుత్వానికి రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గినా, సంక్షేమ పథకాల్లో కోత విధించలేదు. పల్లెప్రగతితో తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శగ్రామాలుగా రూపాంతరం చెందాయి. 12,765 గ్రామాలకు సొంత ట్రాక్టర్లు సమకూరాయి. 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాల పేరుతో పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. 12,736 గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం 91 శాతం పూర్తయింది. వైకుంఠధామాల నిర్మాణం జరుగుతోంది. 2,580 చోట్ల రైతువేదికల నిర్మాణం పూర్తయింది. 93,875 చోట్ల కల్లాలు ఏర్పాటయ్యాయి. పట్టణాల్లో 4,806 శానిటేషన్‌ వెహికిల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. బీపాస్‌ చట్టం తీసుకొచ్చాం. ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తున్నాం.’’ అని చెప్పారు.

‘‘ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ వరుసగా మూడో ఏడాది 3వ స్థానంలో నిలిచాం. హరితహారంలో 210.68 కోట్ల మొక్కలు నాటాం. 13,768 చోట్ల నర్సరీలు ఏర్పాటు చేశాం. జంగిల్‌ బచావో- జంగిల్‌ బడావో నినాదంతో 43,276 హెక్టార్లలో మొక్కలు పెంచుతున్నాం. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 14,338 పరిశ్రమలు వచ్చాయి. 14,59,639 మందికి ఉద్యోగాలు లభించాయి. ఐటీ రంగం వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం లాంటి ద్వితీయశ్రేణి నగరాల్లో విస్తరించింది. ఐటీ ఎగుమతుల విలువ రూ.1,28,807 కోట్లకు చేరింది. ఐటీ రంగంలో 5,82,126 మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌ విశ్వనగరంగా మారుతోంది. 111 ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం సాగుతోంది. 26 ప్రధాన రోడ్లను విస్తరించి, మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్లు, సిగ్నల్‌ ప్రీ జంక్షన్లుగా తీర్చిదిద్దుతున్నాం. 7 స్కైవేలు, 11 మేజర్‌ కారిడార్లు, 68 మేజర్‌ రోడ్లు, 54 గ్రేడ్‌ సెపరేటర్లను చేపట్టాం. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఉద్యోగుల వేతనాలు పెద్దఎత్తున పెంచగలిగాం. ఖాళీల భర్తీతోపాటు ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండగా, పీఆర్సీ అమలు, రిటైర్మెంట్‌ వయసు పెంపు ప్రభుత్వ పరిశీలనలో ఉంది.’’ అని అన్నారు.

బాలసదన్‌ పిల్లల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఎట్‌ హోంను వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌ నుంచి బాలసదన్‌ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ‘‘వ్యవసాయ భూముల యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత ఇవ్వడానికి, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ నూటికి నూరు శాతం విజయవంతమైంది. మానవ నిర్మిత అద్భుతంగా, ప్రపంచంలో నే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పొలాలకు చేరుతున్నాయి. పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. భూగర్భ జలమట్టం 4 మీటర్ల మేర పెరిగాయి. రైతులకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. 2014లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించగలిగితే, నేడు కోటి 4 లక్షల ఎకరాల్లో వరి పండుతోంది. దీనివల్ల తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా మారింది. యాసంగి పంటల కోసం 60 లక్షల మందికి రూ.7,351 కోట్లను పెట్టుబడి సహాయంగా అందించగలిగాం. రైతుబీమా సొమ్ము రూ.1,141 కోట్లకు చేరింది. విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ అని సీపీఈడబ్ల్యూ ప్రకటించడం తెలంగాణ విజయాలకు అంతర్జాతీయ స్థాయిలో దక్కిన ప్రశంస. మిషన్‌ భగీరథ ద్వారా వందశాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తూ తెలంగాణ గొప్ప విజయం సాధించిందని కేంద్ర జల్‌జీవన్‌మిషన్‌ ప్రకటించడం మన ఘనతకు దక్కిన గుర్తింపు. తెలంగాణలో ఆకలిదప్పులు లేవు.. ఆత్మహత్యలు లేవు. ఉద్యమనాయకుడే పాలనా పగ్గాలు పట్టడంతో తెలంగాణ దృష్టితో పరిపాలన సాగుతోంది. తెలంగాణ వేస్తున్న ప్రతి అడుగూ ప్రగతిపథంలో ముందుకుపోతోంది. బంగారు తెలంగాణకు బలమైన పునాదులు పడ్డాయి.’’ అని గవర్నర్ పేర్కొన్నారు.

Latest News