హైదరాబాద్, జనవరి 24 (న్యూస్టైమ్): ఇక్కడి ఘట్కేసర్లోని గట్టు మైసమ్మ జాతర ఆదివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారికి ఆలయ పూజారులు సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు భక్తులకు దర్శనం కల్పించారు. చాలా మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యేక నైవేద్యం (బోనం) తయారు చేసి ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు. మాస్కులు ధరించిన వారినే క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు.
జాతర సందర్భంగా అమ్మవారిని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్రెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ, మున్సిపాలిటీ పాలకవర్గం వేర్వేరుగా అతిథులను సన్మానించారు. నాయకులు బి.దాసు, సింగిరెడ్డి రాంరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, బి. శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, బి.రాధాకృష్ణ, పోచారం చైర్మన్ బి. కొండల్ రెడ్డి, నాగారం చైర్మన్ చంద్రారెడ్డి, కౌన్సిలర్లు, ఘట్కేసర్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.