కొయ్యూరు : విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో మంప పీఎస్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.ఈ క్రమంలో తెల్లవారు జామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఎవరు చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉందని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వివరాలు తెలియడానికి సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని చెప్పారు. ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తున్నామని అన్నారు.ఘటనాస్థలిలో ఏకే- 47 తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్ర నేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు…