హైదరాబాద్, జనవరి 24 (న్యూస్టైమ్): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల భద్రత, శ్రేయస్సుకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో సమావేశం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా సీఎం మాట్లాడారు.
మహిళా ఉద్యోగులు సౌకర్యవంతమైన వాతావరణంలో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్కు అప్పగించారు. తమ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సీఎంకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.