అమరావతి, ఫిబ్రవరి 21 (న్యూస్టైమ్): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యూహాత్మకంగా లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ మాత్రం ఇంత వరకూ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం, ఉక్కు పరిరక్షణ పోరాటం పేరిట రాష్ట్రంలోని అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం వంటివన్నీ గమనించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఆలస్యంగానైనా అటు కేంద్రంలోని పెద్దలను ఆలోచింపజేసేలా, ఇటు కార్మిక వర్గాన్ని ఆకట్టుకునేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ పంపింది.
దీంతో ఇన్నాళ్లూ తెలుగుదేశం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై స్పందించలేదన్న అపవాదును చెరిపేసుకున్నట్లయింది. ‘జరగని పెళ్లికి ముహూర్తాలెందుకు’ అన్నట్లు గత కొద్ది రోజులుగా కేంద్రంపై దుమ్మెత్తిపోసే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాసి విమర్శకుల నోళ్లు మూయించారు.
అసలు చంద్రబాబు రాసిన లేఖలో ఏముందో ఒకసారి పరిశీలిస్తే… ‘‘విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పిలువబడే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను ప్రైవేటీకరించాలని భారత ప్రభుత్వం 2021-2022 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో ప్రతిపాదించింది. 2021 జనవరి 27న ఆర్.ఐ.ఎన్.ఎల్ను ప్రైవేటీకరించే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపినట్లు ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం కార్యదర్శి ప్రకటించారు. 1966 నుండి తెలుగు ప్రజలు ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా చేసిన నిర్విరామ పోరాట ఫలితమే విశాఖపట్నం అర్.ఐ.ఎన్.ఎల్. స్టీల్ ప్లాంట్.
1970లో అప్పటి భారత ప్రధాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మా నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ప్రకారం 1971లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కార్పొరేట్ సంస్థ కింద స్థాపించారు. తరువాత, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను 1982లో ఆర్.ఐ.ఎన్.ఎల్ కార్పొరేట్ సంస్థ పరిధిలోకి తీసుకువచ్చారు. భారతదేశంలో సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారంగా ఇది అనేక విధాలుగా ప్రత్యేకతను సంతరించుకుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల చేసిన మహోద్యమం కారణంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగార ఉద్యమంలో ఆంధ్ర వైద్య కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీమతి ఎవిఎన్ కళాశాల, గుంటూరు, కృష్ణ, వరంగల్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారు.
తెన్నేటి విశ్వనాధం, సర్దార్ గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల్ల గిరిప్రసాద్ రావు, తరిమెళ నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి వారు నాయకత్వం వహించారు. ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమానికి మార్గదర్శకుడు గుంటూరు వాసి దళిత వర్గానికి చెందిన అమృతరావు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఉక్కు కర్మాగారం కోసం ఐక్యం చేయడానికి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీని తరువాత, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు అనుకూలంగా విస్తృత స్థాయిలో ఆందోళన జరిగింది. విశాఖపట్నంలోని ఓల్డ్ పోస్టాఫీసు సమీపంలో పోలీసుల కాల్పుల్లో 12 మంది మృతి చెందడంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునాదులు రక్తంతో తడిచాయి. ఇతర ప్రాంతాలలో కూడా 20 మంది మరణించారు.
విజయవాడలో ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడ, వరంగల్, రాజమండ్రి, సీలేరు, పలాసా, జగిత్యాలలో ఒకొక్కరు, ఇతర ప్రదేశాలలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా 32 మంది తెలుగు ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు, వీరంతా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు (వైజాగ్ స్టీల్ ఈజ్ ఆంద్రాస్ రైట్) అనే నినాదంతో ర్యాలీ చేశారు. ఆందోళనలో భాగంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్కు మద్దతుగా అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరకు ఇతర వ్యక్తులు తమ ఆస్తులను, లాభదాయకమైన వృత్తిని త్యాగం చేశారు. అందువల్ల, చాలా కాలంగా ఆర్.ఐ.ఎన్.ఎల్. స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఐక్యత, గర్వకారణానికి చిహ్నంగా నిలిచింది. 68కి పైగా గ్రామాల ప్రజలు ఉక్కు కర్మాగారం కోసం ఉన్నపళంగా తమ భూమిని త్యాగం చేశారు.
సుమారు 16,000 కుటుంబాలు స్టీల్ ప్లాంట్కు సుమారు 26,500 ఎకరాల భూమిని ఇచ్చాయి. భూమిని స్వాధీనం చేసుకునే సమయంలో భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం చొప్పున వాగ్దానం చేశారు. అయితే, కేవలం 8000 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అనేక అవరోధాలు ఉన్నప్పటికీ, ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి ఉత్పత్తిని ప్రారంభించారు. 1992లో అప్పటి భారత ప్రధాని దేశానికి అంకితం చేశారు. విశాఖపట్నం నగర అభివృద్ధి, విశాఖపట్నంలోని ఆర్.ఐ.ఎన్.ఎల్. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ఆర్.ఐ.ఎన్.ఎల్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా గర్వకారణం. 1991 నుండి 2000 వరకు ఈ ప్లాంట్ సుమారు 4000 కోట్లు నష్టాలలో పడగా అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలోని అప్పటి ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బిఐఎఫ్ఆర్)కు సూచించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం రూ. 1,333 కోట్ల ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీతో ప్లాంట్ను లాభదాయకంగా మార్చడానికి సహాయపడింది.
ఈ ప్లాంట్ ఉక్కు తయారీలో అతిపెద్దది మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు కిరీటంగా ఉంది. మీ నాయకత్వంలో భారత ప్రభుత్వం గుర్తించినట్లు ఉక్కు ఒక వ్యూహాత్మక రంగం. విశాఖపట్నంలోని ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ బందీ గనులు లేకపోవడం, రుణాలపై అధిక వడ్డీ రేట్లు వంటి కారణాల వల్ల నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్.ఐ.ఎన్.ఎల్. స్టీల్ ప్లాంట్కు తమ ఆధీనంలో ఉన్న గనులు కేటాయిస్తే ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొని లాభాల బాట పడుతుంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం, స్టీల్ ప్లాంట్ భూమి రూ. 1.5 నుండి 2 లక్షల కోట్ల విలువ ఉంది. ఈ విధంగా ఆర్.ఐ.ఎన్.ఎల్. స్టీల్ ప్లాంట్ ఉత్తర ఆంధ్ర జీవన రేఖగా గర్వ కారణంగా నిలుస్తుంది.
ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధిని అందిస్తుంది. అందువల్ల, విశాఖపట్నం ఆర్.ఐ.ఎన్.ఎల్. స్టీల్ ప్లాంట్ ప్రజల మనోభావాలు, భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున దానిని రక్షించడం, పోషించడం చాలా అవసరం. అందువల్ల, నేను వ్యక్తిగతంగా, పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ఆర్.ఐ.ఎన్.ఎల్. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా, స్టీల్ ప్లాంట్ లాభదాయకంగా మారేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది, తద్వారా ప్రతీ వాటాదారులకు విజయం చేకూర్చబడుతుంది.’’ అని చంద్రబాబు లేఖ సారాంశం.
అయితే, ఇతర పార్టీలు కూడా దేనికవి వేర్వేరుగా కేంద్ర ప్రభుత్వానికి పంపించే పనిలో నిమగ్నమయ్యాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని తెలుగు రాష్ట్రాలలో పార్టీ పటిష్టతను దృష్టిలో పెట్టుకుని బీజేపీ విశాఖ ఉక్కుపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుని ప్రభుత్వానికి సూచిస్తుందో వేచిచూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ అంశంపై జనసేన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి వెళ్లి కేంద్రంలోని పెద్దలతో సంప్రదింపులు జరిపి ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసి ఫ్యాక్టరీని ఆదుకునేందుకు మార్గాలను సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల దృష్ట్యా ఈ వారంలోనే కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించే పరిస్థితులు లేకపోలేదు.