న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (న్యూస్టైమ్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ 2021 ని ఈ నెల 10న సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ‘మన భవిష్యత్తు ను పునర్ నిర్వచించుకోవడం: అందరికీ సురక్షితమైన, భద్రమైన పర్యావరణం’ అనే అంశం ఈ శిఖర సమ్మేళనానికి ఇతివృత్తంగా ఉండనుంది. గుయానా సహకార గణతంత్రం అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్; పాపువా న్యూ గునియా ప్రధాని జేమ్స్ మరాపే; మల్దీవ్స్ గణతంత్రం పీపుల్స్ మజ్లిస్ స్పీకర్ మొహమ్మద్ నషీద్, ఐక్య రాజ్య సమితిలో డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా జె మొహమ్మద్లతో పాటు, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటారు. ది ఎనర్జీ ఎండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్స్ (టిఇఆర్ఐ) ప్రధాన కార్యక్రమంలో భాగం అయిన వరల్డ్ సస్టెనబుల్ సమిట్ తాలూకు 20వ సంచికను ఈ నెల 10వ తేదీ నాటి నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు.
ఈ శిఖర సమ్మేళనం పెద్ద సంఖ్య లో ప్రభుత్వాలు, వ్యాపార ప్రముఖులు, విద్యావేత్తలు, జలవాయు శాస్త్రవేత్తలు, యువజనులు, జలవాయు పరివర్తనకు వ్యతిరేకంగా పోరు సలుపుతున్న పౌర సమాజాన్ని ఒక చోటుకు తీసుకురానుంది. భారతదేశానికి చెందిన పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ; నూతన, నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ; పృధ్వీ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖలు ఈ శిఖర సమ్మేళనానికి కీలక భాగస్వాములుగా ఉంటాయి. ఈ శిఖర సమ్మేళనంలో శక్తి, పరిశ్రమ పరివర్తన, ప్రకృతి ఆధారితమైన పరిష్కార మార్గాలు, క్లయిమేట్ ఫైనాన్స్, చక్రీయ ఆర్థిక వ్యవస్థ, శుద్ధ మహాసాగరాలు, వాయుకాలుష్యం తదితర అంశాలు చర్చకు రానున్నాయి.