విజయవాడ, ఫిబ్రవరి 28 (న్యూస్టైమ్): దేవాలయాల పరిరక్షణకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ ఆచరణ పరిరక్షణ సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు. స్వామిజీలు ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఆచరణలోకి తీసుకుని వస్తామన్నారు. దేవలయాల నుండి ఆదాయం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెందదని, కేవలం టెంపుల్ డెవలప్మెంట్ కోసం, అలాగే దేవాదాయ శాఖ ఉద్యోగులకి మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. దేవాలయ రాజకీయాలతో ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర చేస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంపై కొందరు స్వామీజీల తీరు బాధాకరమన్నారు. దేవాలయాల రక్షణ బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేశామని మంత్రి చెప్పారు.