రాష్ట్రీయం

రాష్ట్ర బంద్‌కు ఏపీ సర్కారు సంఘీభావం

అమరావతి, మార్చి 4 (న్యూస్‌టైమ్): విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు సంఘీభావం తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. గురువారం విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపిస్తున్నామన్నారు. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలన్నది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్. విశాఖ ఉక్కును నిలబెట్టుకునే ప్రత్యామ్నాయాలను ఇప్పటికే సీఎం జగన్ కేంద్రం ముందుంచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రజల ఆస్తిగా మార్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సంఘీభావం ప్రకటిస్తోంది.’’ అని అన్నారు.

‘‘ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. సుదీర్ఘకాలం ప్రతి తెలుగువాడు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం చేశారు. రేపటి రాష్ట్ర బంద్ నేపథ్యంలో ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోకుండా, ఆర్టీసీ బస్సుల్ని మధ్యాహ్నం 1 గంట వరకు నడపరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సులు తిరిగేలా సహకరించాలని కోరింది. ఆర్టీసీ సోదరులు బ్లాక్ బ్యాడ్జీలతో మధ్యాహ్నం విధులకు హాజరు కావడం ద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేయాలని కోరుతున్నాం.’’ అని నాని చెప్పారు.

‘‘విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. తెలుగు వాళ్ళ పోరాట ఫలితం విశాఖ ఉక్కు. అనేక పోరాటాలతో, 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం.. విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగా ఉంచే విధంగా కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. వ్యాపారం చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానప్పటికీ, ప్రతి వస్తువు ప్రైవేటు చేతుల్లో ఉంటే ధరలు నియంత్రించడం కష్టమయ్యే పని. కాబట్టి, ప్రజలకు అవసరమైనవి కొన్ని కచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలన్నది మా ప్రభుత్వ విధానం. ప్రత్యామ్నాయ మార్గాలు లేవు అన్న పరిస్థితుల్లో మాత్రమే ప్రైవేటీకరణకు వెళ్ళాలి. ప్రతిదీ ప్రైవేటుపరం చేయడం కరెక్టు కాదు. పునాది మరిచిపోకూడదు, ప్రజల అవసరాలు మరిచిపోకూడదు. విశాఖ ఉక్కు అప్పుల ఊబిలో ఉంటే, దాని నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే సీఎం జగన్ చూపించారు.’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రైవేటీకరణ కాకుండా, ఒక కార్పొరేషన్ ను ప్రభుత్వ సంస్థగా, అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆర్టీసీని ప్రజల ఆస్తిగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఆర్టీసీని బతికించాలని, ప్రైవేటు వ్యక్తుల దోపిడీని అరికట్టి, సామాన్యులకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యంతో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి, ప్రభుత్వంపైన అదనంగా రూ. 3600 కోట్ల జీతభత్యాల భారం పడుతున్నా, ఆర్టీసీని ప్రజల ఆస్తిగా ఉండాలనే దానిని ప్రభుత్వంలో విలీనం చేశాం. అలానే విశాఖ ఉక్కును కూడా ప్రజల ఆస్తిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్నదే మా నినాదం. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. జల్సాల కోసం, షోకుల కోసం, పిప్పి పన్ను పీకించుకోవడం కోసం అప్పులు చేసిన టీడీపీ నేతలు మాకు సుద్దులు చెప్పటం శోచనీయం. పన్నులు వేసే ప్రభుత్వం జగన్‌మోహన్ రెడ్డిది కాదు.’’ అని చెప్పారు.