ఆహారంజాతీయంరాష్ట్రీయం

నిరుధ్యోగుల‌కు శుభ‌వార్త కేంద్ర పరిధిలోని అన్ని ఉద్యోగాలకు ఇక‌పై ఒకే పరీక్ష.

న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో కేంద్ర పరిధిలోని అన్ని ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ తెలిపారు.ఇందుకోసం నూతనంగా జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ)ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.దీని ద్వారా నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని, ఉద్యోగ నియామకం, ఎంపిక ప్రక్రియ మరింత సులభతరం కానుందని మంత్రి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్‌ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షను ఎన్‌ఆర్‌ఏ నిర్వహిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 20 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉద్యోగ నియామకానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత నిర్ణయంతో అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.సీఈటీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్‌ పర్సనల్ (ఐబీపీఎస్) కోసం సీఈటీ తొలి దశ పరీక్షలు నిర్వహిస్తుంది..సీఈటీని డిగ్రీ, పన్నెండు, పది తరగతులు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా రాయవచ్చు. దేశవ్యాప్తంగా 117 జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌ఏ యువ ఉద్యోగార్థులకు వరంగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు. అలానే సీఈటీ ద్వారా పలు రకాల పరీక్షలు రద్దవడంతో పాటు విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయని ప్రధాని వెల్లడించారు.ప్రస్తుత విధివిదానాల ప్రకారమే రిజర్వేషన్లు అమలవుతాయని మంత్రి తెలిపారు. అలానే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద జైపుర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను లీజుకు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఎయిర్‌పోర్ట అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ)కు రూ.1,070 కోట్లు సమకూరనున్నాయని జావడేకర్ తెలిపారు..