అనంతపురం, ఫిబ్రవరి 8 (న్యూస్టైమ్): స్టీల్ప్లాంట్పై కేంద్రం నిర్ణయం దురదృష్టకరమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2015లో స్టీల్ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నారని, కేంద్రం నిర్ణయంతో చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయవద్దని వైయస్ఆర్సీపీ డిమాండు చేస్తుందన్నారు. ఈ విషయంపై పునరాలోచించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారన్నారు. సొంత గనులు కేటాయిస్తే నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు.
సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ నిర్ణయం బాధాకరమన్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ఆపడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ పునరాలోచించాలని సూచించారు. ఎస్ఈసీ ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో అర్హత కోల్పోయేలా టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.