విజయవాడ, ఫిబ్రవరి 23 (న్యూస్టైమ్): ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మతిభ్రమించిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శారదాపీఠం స్వామీజీపై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు తక్షణమే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ శారదాపీఠంలో సేవలు అందిస్తున్న స్వరూపానందేంద్ర స్వామీజీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. దేవుడిపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ స్వామీజీ వద్దకు వెళ్తారన్నారు.
బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబు స్వామీజీ గురించి మాట్లాడే హక్కు లేదని ఎమ్మెల్యే మాల్లాది విష్ణు ధ్వజమెత్తారు. పుష్కరాల్లో అమాయకుల ప్రాణాలు తీసిన చంద్రబాబు స్వామీజీ గురించి మాట్లాడటమా? విజయవాడలో ఆలయాలను కూల్చిన మీరు స్వామీజీ గురించి మాట్లాడటం దారుణమన్నారు. దెయ్యాల్లా ప్రవర్తిస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలకు స్వరూపానందేంద్ర స్వామీజీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు తక్షణమే స్వామీజీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.