కర్నూలు, జనవరి 23 (న్యూస్టైమ్): ప్రజా ఆరోగ్యం కంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అత్యవసరం కాదని, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికలు జరపాలనుకోవడం అవివేకమని వైయస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. కరోనా వైరస్ సర్వత్రా వ్యాపించి ఉందని, ఇంకా పూర్తిగా తగ్గలేదన్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ అంటూ హడావిడి చేయడం దురదృష్టకరమన్నారు. ఎంపీ సంజీవ్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ప్యాండమిక్ స్టేజిలోనే ఉన్నామని, ఎండమిక్ స్టేజీకి పోవడానికి ఇంకా టైమ్ పడుతుందన్నారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం కరోనా తగ్గుదల 30 శాతం మాత్రమే ఉందని, 60 శాతం వస్తేనే నిర్భయంగా బయట తిరగడానికి వీలుంటుందన్నారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ కూడా శానిటైజర్ వాడాలని, మాస్క్ పెట్టుకొని తిరగాలని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తుందని గుర్తుచేశారు. ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉన్నామని, ఇటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంత అత్యవసరం కాదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలను, ప్రజల ప్రాణాలను ఎందుకు ఫణంగా పెట్టి ఎందుకు ఎన్నికలు జరపాలనుకుంటున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను ఎంపీ సంజీవ్ ప్రశ్నించారు. లాక్డౌన్ నుంచి 400 మంది ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయారని గుర్తుచేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.