రాష్ట్రీయం

‘ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికాభివృద్ధి’

అమరావతి, ఫిబ్రవరి 20 (న్యూస్‌టైమ్): రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయామ‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే పారిశ్రామికాభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో నీతి ఆయోగ్ భేటీ అత్యంత ప్రాధాన్యమైందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన వర్చువల్‌ పద్దతిలో జరిగిన 6వ నీతి ఆయోగ్‌ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అర్ధవంతమైన చర్చ జరగాలన్నారు. భారత్‌ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని కోరారు.

‘‘ఐదు రకాల అంశాలు తయారీ రంగానికి అవరోధాలుగా మారాయి. రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్ ఖర్చులు అధికంగా ఉండటం భూసేకరణలో ఆలస్యం వంటి అంశాలు తయారీ రంగానికి అవరోధంగా మారాయి. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై ప్రభుత్వం ఏడాదికి 10 నుంచి 11 శాతంవడ్డీ చెల్లించాల్సి వస్తోంది. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతం మించి ఉండటం లేదు’’ అని సీఎం అభిప్రాయవ్యక్తం చేశారు. పనితీరు కనబరుస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని సీఎం వైయ‌స్ జగన్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన డిస్ట్రిక్‌ బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌కింద 229 సంస్కరణల విషయంలో ముందుకు వెళ్తోందన్నారు.

‘‘రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తాం. విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తారని బేషరతుగా పార్లమెంటులో ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదురకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించడంతోపాటు, నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగుమందులను రైతులకు అందుబాటులో తీసుకు రావాల్సి ఉంది. పంటల స్టోరేజీ, గ్రేడింగ్, ప్రాససింగ్‌లో కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సి ఉంది. రైతులు తమ పంటలను సరైన ధరకు ఫాంగేట్‌వద్దే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిద్వారా ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయిన పక్షంలో సకాలంలో వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.’’ అని పేర్కొన్నారు.

‘‘రైతులకు సహాయకారిగా, అండగా ఉండేందుకు రాష్ట్రంలో 10,731 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. మల్టీ పర్పస్‌ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఆర్బీకేల్లో సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను. విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నాం. 10 వేల మెగావాట్ల సోలార్‌విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇటీవల టెండర్‌ ప్రక్రియను కూడా చేపట్టాం. రాష్ట్రంలో ఉన్న సౌరశక్తిని పరిధిలోనికి తీసుకుని 30 ఏళ్ల కాలానికి యూనిట్‌కు రూ.2.48 పైసలకు యూనిట్‌విద్యుత్‌ రాష్ట్రానికి అందుబాటులోకి వస్తోంది. సగటున రూ.5.2లకు యూనిట్‌ కరెంటును రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీద్వారా మరో 33వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి విషయంలో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నాను. విద్యా రంగంలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపట్టాం.’’ అని జగన్ తెలిపారు.

‘‘46 వేల ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను, ప్రభుత్వ హాస్టళ్లను ఈ కార్యక్రం కింద బాగుచేస్తున్నాం. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లిషు మీడియంను తీసుకువచ్చాం. ఆరోగ్య రంగంలో కూడా నాడు– నేడు చేపట్టాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో నాడు – నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాల్లో 10వేలకుపైగా విలేజ్‌ క్లినిక్స్‌ను ప్రారంభిస్తున్నాం. కొత్తగా మరో 16 వైద్య కళాశాలలను నిర్మించబోతున్నాం. ఇప్పటికే కేంద్రం 3 కాలేజీలకు అనుమతి ఇచ్చింది. మరో 13 కాలేజీలకు అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాం. పరిపాలనలో సంస్కరణలు తీసుకు వచ్చాం. వికేంద్రీకరణే కాకుండా సమర్థవంతంగా టెక్నాలజీని వాడుకుంటున్నాం. అవినీతి, వివక్షకు తావులేకుండా పథకాలను, సేవలను అందిస్తున్నాం. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టాం. 540 రకాల అత్యవసర సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్నాం. అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్‌ సదుపాయం అందించడం ద్వారా ఈ సేవలు మరింత మెరుగుపడతాయి. భారత్‌ నెట్ ‌ప్రాజెక్ట్‌ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలను చేపడుతుంది. గ్రామస్థాయిలో ప్రతి పౌరుడికీ, ప్రభుత్వ వ్యవస్థకూ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందిస్తాం. గ్రామాల్లో పబ్లిక్‌ డిజిటల్‌ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకు వచ్చి వర్క్‌హోంను అందుబాటులోకి తీసుకు వస్తాం.’’ అని సీఎం అన్నారు.

అయితే, నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. జగన్‌పై ఉన్న కేసు దృష్ట్యా ఆయన ప్రధానిని సూటిగా ప్రశ్నించేందుకు భయపడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అదే విధంగా ఇతర వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు కూడా సీఎం ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా నీతి ఆయోగ్ లాంటి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశంలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశాన్ని ఎందుకు ప్రస్థావించలేదని ప్రశ్నిస్తున్నారు.