ఆంధ్రప్రదేశ్తెలంగాణనేరాలు .. ఘోరాలున్యూస్ప్రాంతీయం

రెచ్చిపోయిన మావోయిస్టులు…అర్ధరాత్రి బస్సు దగ్ధం.

అల్లూరి సీతారామరాజు జిల్లా: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.ఆల‌స్యంగా అందిన స‌మాచారం మేర‌కు సంఘ‌ట‌న వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్న మావోయిస్టులు ప్రయాణికులను దించి తగులబెట్టారు.ఈ ఘటన చింతూరు మండలం కొత్తూరు దగ్గర చోటుచేసుకుంది. రాత్రివేళ ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సును ఆపి ప్రయాణికులను కిందికి దింపారు. అనంతరం మావోయిస్టులు దానికి నిప్పుపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కరపత్రాలను సైతం వదిలి వెళ్లారు.

అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి డీజిల్ పోసి దగ్ధం చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. అనంతరం భయాందోళనకు గురైన ప్రయాణికులు సర్వేల గ్రామంలో తలదాచుకొని సోమవారం ఉదయం చింతూరుకు చేరుకున్నారు.కాగా.. ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతోపాటు దండకారణ్యంలో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు.