తిరుపతి, జనవరి 23 (న్యూస్టైమ్): రామతీర్థం ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేలా పునఃనిర్మిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రామతీర్థంలో ప్రతిష్టించే విగ్రహాలు తిరుపతి నుంచి ఇప్పటికే రామతీర్థానికి తరలించామని తెలిపారు. ఆలయాన్ని పునఃనిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
మంత్రి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనతంరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ నూతన విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ట చేసి, రామ తీర్థం ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు. పూర్వవైభవం వచ్చేలా ఆలయ నిర్మాణం సంవత్సరాల కాలంలో పూర్తి చేసి, విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని మంత్రి స్పష్టం చేశారు.