రాష్ట్రీయం

నిమ్మగడ్డను బర్తరఫ్ చేయాలి: కాకాణి

నెల్లూరు, ఫిబ్రవరి 8 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆ ప‌ద‌విలో ఉండ‌టానికి అన‌ర్హుడ‌ని, ఆయ‌న్ను వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గ‌వ‌ర్న‌ర్‌ను కోరారు. ఈ మేర‌కు ఆదివారం కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహనిర్బంధంలోనే ఉంచాలని ఎలక్షన్ కమిషన‌ర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేవేయడం నిమ్మగడ్డకు చెంపపెట్టులాంటిద‌న్నారు. నిమ్మగడ్డ రమేష్ ఎందుకు మితిమీరి ప్రవర్తిస్తున్నారో తెలియడం లేద‌న్నారు.

ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ తన పరిధి దాటి ప్రవర్తించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడమనేది దుర్మార్గమ‌న్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వర్తించాల్సిన ఎస్ఈసీ, ఏకపక్షంగా, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించినందుకు హైకోర్టు మొట్టికాయలు వేసింద‌ని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో నిమ్మ‌గ‌డ్డ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైదొలిగి రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి సహకరించాల‌ని గోవ‌ర్థ‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

ఒక పక్క హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా తాను టీడీపీకి అనుకూలంగా వ్యహరించాలనే ఆలోచన నిమ్మగడ్డ చేస్తున్నాడు తప్ప మరో ఆలోచన లేద‌న్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసులు మీద ప్రివిలేజ్ కమిటీ కూడా నిమ్మగడ్డ వ్యవహరంపై విచారణకు స్వీకరించామ‌న్నారు. శాసనసభ రాజ్యాంగ వ్యవస్థ అని, అసెంబ్లీ కోర్టుల పరిధిలోకి రాదని, అసెంబ్లీ కానీ, ప్రివిలైజ్ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని నిమ్మగడ్డ రేపు కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేయలేరని వెల్ల‌డి చేశారు. ఎన్నికలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులను అప్పుడు లోక్ సభ స్పీకర్‌గా ఉన్న సోమనాథ్ చటర్జీ తోసిపుచ్చడం జరిగిందన్నారు.

పార్లమెంట్ కానీ శాసనసభ కానీ తీసుకున్న సభా నిర్ణయాల్లో జోక్యం చేసుకోనే హక్కు కోర్టులకు లేదని ఆయన ఆ రోజు స్పష్టం చేయడం జరిగిందని, రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగానికి మూలస్తంభమైన శాసనసభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి వస్తుందని, తప్పనిసరిగా విచారణ చేపడతామని, విచారణలో వాస్తవాలు బయటకు తీసిన తర్వాత ఎన్నికల కమిషనర్ చర్యల మీద, ఆయన చేసిన వ్యాఖ్యల మీద, ఆయన చేస్తున్న అన్యాయమైన ప్రవర్తన మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని, ఆ పరిస్థతి ఉత్పన్నమైతుంద‌న్నారు. నిమ్మగడ్డ చర్యల వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవడానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిద్ధంగా ఉండాల‌న్నారు. గవర్నర్ స్పందించి వెంటనే నిమ్మగడ్డను బర్తరఫ్ చేయాల‌ని కోరారు.