తెలంగాణ

రూ.3500 కోట్ల వ్యయంతో సీవరేజ్ డ్రైనేజీ ఆధునికీకరణ

హైదరాబాద్, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో రూ. 3500 కోట్ల వ్యయంతో డ్రైనేజీ, సీవరేజ్ ఆధునికీకరణ పనులను చేపడుతున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. కూకట్పల్లి నియోజకపరిధిలో దాదాపు రూ. 71.49 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కైతలాపుర్‌లో వీడీసీసీ రోడ్డు నిర్మాణపనులు ప్రారంభించిన సందర్బంగా మంత్రి స్థానికులతో మాట్లాడారు. గత టర్మ్‌లో ఏ విధంగానైతే రూ. 3000 కోట్లతో శివారు ప్రాంతాలకు తాగునీటిని అందించి నీటి కొరత లేకుండా చేసామో అదే విధంగా ఈ టర్మ్‌లో రూ. 3500 కోట్ల వ్యయంతో శివారు ప్రాంతాలలో డ్రైనేజీ, సీవరేజ్ ఆధునికీకరణ పనులను చేపడున్నట్టు తెలియచేసారు.

నగరంలో వర్షాల వల్ల తిరిగి కాలనీలు, బస్తీలు ముంపుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. కైతలాపుర్‌లోని ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ఆధునీకరించడం ద్వారా స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని హామీనిచ్చారు. కరోనా పూర్తిగా పోలేదని, మరోసారి లాక్‌డౌన్ రావద్దంటే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని నగర పౌరులకు కేటీ రామా రావు విజ్ఞప్తి చేశారు. కైతలాపుర్‌లో గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన గృహాలకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.66.59 కోట్లతో నిర్మించిన ఆర్‌యూబీని మంత్రి కె.టి.ఆర్. ప్రారంభించారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో తీవ్రమైన ట్రాఫిక్ కలిగిన హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మార్గంలో ఏవిధమైన అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడింది. హై టెక్ సిటీ ఎంఎంటిఎస్ రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం కావడం ఈ ప్రాంత వాసులకు మరింత వెసులుబాటు అయింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్షి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, డిప్యుటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, మంత్రి కేటీఆర్ మూసాపేట్ సర్కిల్‌లోని అంబేద్కర్ నగర్ నుండి డంపింగ్ యార్డ్ వరకు రూ. 99 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కేపీహెచ్‌బీ కాలనీ నాలుగవ ఫేజ్‌లో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద 66.59 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్‌యూబీని ప్రారంభించారు. అదే ప్రాంతంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌నూ మంత్రి ప్రారంభించారు.