న్యూఢిల్లీ, జనవరి 23 (న్యూస్టైమ్): పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ సర్కారు తప్పులో కాలేసింది. దీంతో ప్రభుత్వ పిటిషన్ సుప్రీం కోర్టు ముందుకు విచారణకు రాలేదు. ప్రభుత్వం వేసిన పిటిషన్ తప్పుల తడకగా ఉందని సరిచేయాలని సూచించారు కోర్టు రిజిస్ట్రీ.
ఆ తప్పులను సరిచేసి ఇచ్చేలోపే న్యాయస్థానం సమయం ముగిసిపోయింది. దీంతో అత్యవసర విచారణ సాధ్యపడలేదు. అటు రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ నేడే విడుదల కానుంది. దీంతో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం. శనివారం, ఆదివారం కోర్టుకు సెలవు. అంటే మళ్లీ సోమవారమే పిటిషన్ కోర్టు ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
అందుకే ప్రభుత్వం హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేడే విడుదల కానుంది. ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కోర్టులు ఆ విషయంలో జోక్యం చేసుకోవని అంటున్నారు న్యాయ నిపుణులు.