సంస్కృతి

శ్రీకపిలేశ్వరాలయంలో తిరుమంజనం

తిరుపతి, ఫిబ్రవరి 28 (న్యూస్‌టైమ్): తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. మార్చి 4 నుండి 13వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.

ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరోవైపు, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4 నుండి 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్-19 నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనసేవల వివరాలు నిర్వహించనున్నారు. మార్చి 4న గురువారం ఉదయం ధ్వజారోహణం అనంతరం స్వామివారిని హంస వాహనంపై ఊరేగించనున్నారు. 5న శుక్ర‌‌వారం ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 6న శ‌నివారం ఉదయం భూత వాహనం, సాయంత్రం సింహ వాహనం, 7న ఆది‌వారం ఉదయం మకర వాహనం, సాయంత్రం శేష వాహనం, 8న సోమ‌‌వారం ఉదయం తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం అధికారనంది వాహనం, 9న మంగ‌ళ‌వారం ఉదయం వ్యాఘ్ర వాహనం, సాయంత్రం గజ వాహనం, 10న బుధ‌వారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం అశ్వవాహనం, 11న గురు‌వారం ఉదయం రథోత్సవం (భోగితేరు), సాయంత్రం నందివాహనం, 12న శుక్ర‌వారం ఉదయం పురుషామృగ వాహనం, కల్యాణోత్సవం, సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, 13న శ‌నివారం ఉదయం శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం, సాయంత్రం సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.