ఆంధ్రప్రదేశ్రాష్ట్రీయంసంస్కృతి

టీటీడీ చైర్మన్ గా వైవి.సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం.

తిరుమల/11 ఆగస్టు : తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి వై.వి సుబ్బారెడ్డితో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు.ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి,చైర్మన్ వై.వి సుబ్బారెడ్డిని శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం చిత్రపటం అందించారు.పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్ ను అభినందించారు. ఉప ముఖ్యమంత్రి  కె. నారాయణ స్వామి , మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎ. శ్రీనివాసులు, పి.రవీంద్ర రెడ్డి, ప్రసాదరాజు, దొరబాబు, ఎంపి డాక్టర్ గురుమూర్తి, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటి మేయర్  భూమన అభినయ్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివి ఎస్వో గోపీనాథ్ జెట్టితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కోవిడ్ తో ఆగిన కార్యక్రమాలు కొనసాగిస్తాం : చైర్మన్.
     గత పాలక మండలి అనేక బృహత్తర కార్యక్రమాల నిర్వహణకు ఆమోదం తెలిపినా కోవిడ్ వల్ల అవి ఆగిపోయాయన్నారు.రాబోయే రోజుల్లో వీటన్నిటినీ కొనసాగిస్తామని చైర్మన్  వై.వి సుబ్బారెడ్డి చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఆలయం ఎదుట తనను కలిసిన మీడియాతో మాట్లాడారు.ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడం కోసమే శ్రీవేంకటేశ్వర స్వామి వారు మరోసారి తనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు ఈ భాగ్యం కల్పించిన స్వామివారితో పాటు ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. దేశవ్యాప్తంగా సుమారు వంద ఆలయాల్లో ప్రారంభించిన గుడికో గోమాత  కార్యక్రమం కొనసాగిస్తూ,దేశంలోని ముఖ్య ఆలయాల అన్నింటిలో భక్తులు గోపూజ చేసుకునే ఏర్పాటు చేస్తామని వై.వి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, కోవిడ్ నుంచి విముక్తి లభించేలా చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు కొవిడ్ పూర్తిగా పోయే వరకు కొనసాగిస్తామని చెప్పారు.గో ఆధారిత ఎరువుల ద్వారానే పండించిన  ఉత్పత్తులతో స్వామి వారికి నిత్య నైవేద్యం సమర్పించే కార్యక్రమం వంద రోజులకు పైగా కొనసాగుతూ ఉందన్నారు. శాశ్వతంగా ఈ కార్యక్రమం కొనసాగే ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు.సామాన్య భక్తులకు సులభంగా,శ్రీఘ్రంగా స్వామి వారి దర్శనం కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కోవిడ్ కారణంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా నిలిపి వేసిన సర్వ దర్శనం 15 రోజుల్లోపు కొంత సంఖ్యలో పునరుద్దరించేందుకు గల అవకాశాలు పరిశీలించేందుకు అధికారులతో చర్చిస్తానని  తెలిపారు.